Translate

31 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 054 (266 – 270)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. భీముడి చేతిలో ధార్తరాష్ట్రులు ఎన్నవరోజునుండి చనిపోవడం మొదలయింది?

2. యుద్ధానికి ముందు ఏ పక్షం వారు ముందుగా శంఖధ్వానం చేశారు? ఎవరు?
3. యుద్ధం చెయ్యటానికి పూర్వం ధర్మరాజు భీష్ముని అనుమతిని కోరినట్లే మరొక ప్రసిద్ధ వ్యక్తి కూడా కోరాడు, ఎవరాతడు?
4. చంపకుండా ధర్మరాజును ప్రాణాలతో పట్టి తీసుకురమ్మని దుర్యోధనుడు గురుని కోరాడు, ఎందుచేత?
5. కౌరవులకు పాండవులతో వైరం బలువు (మిక్కుటము) చేశానని ఒప్పుకున్నాడు కర్ణుడు, ఎప్పుడు?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. నాలుగవరోజు. భీష్మపర్వము ద్వితీయాశ్వాసము 236 & 257 వచనములు
|| ..నజ్జరాసంధమర్దనుండు ఘనశార్దూలంబు బాలమృగంబులం గని కవియు చందంబున నెదుర్కొని సేనాపతిశిరంబు భల్లంబునం ద్రుంచి బాణత్రయంబున జలసంధు నంతకాలయంబున కనిచి సుషేణువక్షస్థ్సలంబున వలుఁదనారసంబునాటించి పడవైచి భీమబాహునస్త్రపంచకంబునం జంపి నుగ్రు నుత్తమాంగంబు వెడఁదవాతియమ్మునం గుండలంబులతోఁ గూల్చి భీమ భీమరథుల నొక్కుమ్మడిం బెక్కమ్ములంగూలనేసి నగుచు మిక్కుటమ్మగునాలుగమ్ముల సులోచనుం గీటడంగించిన. (236)
|| అని యిట్లు నాలవనాఁడు ధార్తరాష్ట్రులు తూలపోవుట చెప్పిన విని సంజయునకు నాంబికేయుండిట్లనియె. (257)

2. కౌరవపక్షం భీష్ముడు. - భీష్మపర్వము ప్రథమాశ్వాసము 174,176 వచనములు; 175 పద్యము
|| ……యమ్మహీపతికిఁ బ్రియంబు పుట్ట శాంతనవుండు సింహనాదంబు చేసి శంఖంబు పూరించిన. (174)
|| తనతనశంఖంబును ద
      క్కును గలదొర లెల్ల ననికి గొనకొని పూరిం
      చినవివిధతూర్యనాదం
      బును జెలఁగె నభంబు దిశలుఁ బూర్ణంబులు గాన్. (175)
|| అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రంబును యుధిష్ఠిరుం డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖదండ నాయకులు తమతమశంఖంబులు బూరించిన. (176)

3.కర్ణుడు 11వ రోజున. ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 39 వచనము ; 40-47 పద్యములు
|| నడచి నదీనందనుఁ డున్న యెడకుఁ జేరంబోయి శోషించినసముద్రంబు చందంబున విమానంబు విఱిగిపడినదివ్యుని తెఱంగున భూతలపతితుం డయినపతంగుభంగిని భగ్నపక్షం బైనమైనాకంబుమాడ్కి బొలుచునతనికడకుం బాదచారియై యరిగి యాఫల్గునునారాచనిచయంబునం బొదువంబడి యమునానదీహ్రదస్థితంబును మదనిమీళితంబును నై శోభిల్లుశుండాలంబు ననుకరించుచు వీరశయన మహనీయుండైన యమ్మాహానుభావునియడుగులపైఁ గన్నీరు తొరఁగం బ్రణమిల్లి కేలు మొగిడ్చి వినయవినమితశరీరుం డై. (39)
వచ్చితి రాధేయుఁడఁ గను
    విచ్చి ననుం జూడు భరతవీరాగ్రణి నీ
    సచ్చిరితముఫల మే యి
    ట్లిచ్చట నీయునికి ధాత నే మన నేర్తున్. (40)
పావనంబు లయినపలుకులు నా చెవు
     లార నెమ్మి నన్ను నాదరింపు
     మయ్య ధర్మనిత్య యంచితసత్య శం
     తనుకుమార గాఢధైర్యసార. (41)
పేర్చినమూఁకఁ గూడ నడపింపఁగఁ గోల్తల సేయఁ దీవ్రబా
     ణార్చుల మార్బలంబుల రయంబున నీఱుగఁ గాల్ప నాజి నీ
     నేర్చినభంగి నొం డొకఁడు నేర్చునె పాండవబాహుసంపదల్
     పేర్చు నెలర్చు నింకఁ గురుబృందము లెల్లను దల్లడిల్లఁగన్. (42)
శరజిహ్వాభీకరుఁ డగు
    నరుడను శిఖ నిగుడఁ జేసి నారాయణదు
    ర్భరపవనుఁ డింక బంధుర
    కురుసేనాకాననంబు క్రొవ్వడఁగించున్. (43)
భరితాశాంతరపాంచజన్యరవదృప్యద్దేవదత్తధ్వని
     స్ఫురణన్ వీలును వ్రయ్యఁ గేతనకపి స్ఫూర్జత్ప్రభం జూడ్కు లా
       తురతం బొందఁగఁ జండగాండివసముద్భూతాస్త్రజాలంబు లె
       వ్వరు సై రింతురు నీవు దక్క భుజగర్వస్ఫూర్తినిర్వాహకా. (44)  
మెయిమెయిం బెనంగి మెచ్చించి ముక్కంటి
     చే వరంబు గొని విశిష్టదివ్య
     కర్మదీప్తుఁ డైనగాండీవి నొరుఁ డాజిఁ
     జెనయఁజాల కునికి చెప్ప నేల. (45)
అని పెక్కుమాట లాడిన
    విని యాదరభరితనేత్రవిస్తారుం డై
    యనిమిషనదీతనూజుఁడు
    కనుఁగొనుటయు మఱియు మ్రొక్కి కర్ణుఁడు పలికెన్. (46) 
|| ఆనరు నే నొకండన విషానలదుస్సహదృష్టిభీషణం
  బైనమహాభుజంగమము నద్భుతమంత్రనిరస్తదర్పముం
  గా నొనరించునట్లు భుజగర్వ మడంచెద నస్త్రశస్త్రవి
  ద్యానిపుణత్వసంపద నుదాత్తగుణోత్తర నీవు పంపఁగాన్. (47)

4.ధర్మరాజును చంపితే అర్జునుడు ఎవరినీ బ్రతుకనీయడనీ, ప్రాణాలతో పట్టితెస్తే మళ్లీ జూదమాడించి అడవులకు పంపవచ్చనీ. - ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 111 పద్యము
సీ|| ఆధర్మసూనుఁ గయ్యంబునఁ జంపినఁ గోపించి గాండీవి కురుబలంబు
    సమయించు మన మోపి సర్వపాండవులను జంపితి మేనిఁ బ్రచండచక్ర
    ధారఁ గౌరవకోటితల లేఱి రాజ్యంబు గోవిందుఁ డీకున్నె గొంతి కయినఁ
    గాన యుధిష్టిరుఁ గాయంబు నొంపక తెచ్చి జూదం బాడుతెఱఁ గొనర్చి
తే|| మగుడ నడవికి ననిచినఁ దగిలి యతని
    తోడఁ దమ్ములుఁ బోనంతతోనయెల్ల
    దొసఁగు మాలు నప్రతిహతదోర్విభూతిఁ
    బెద్దకాల మే నేలుదుఁబృథివి యెల్ల. (111)

5. అంపశయ్యమీద భీష్మునితో 10వ రోజు. భీష్మపర్వము తృతీయాశ్వాసము 449 పద్యము
|| మాటలు పెక్కు లాడి యనుమానము లేక సభం గడంగి ప
    ల్మాటుఁ బరాభవించితిఁ జలంబునఁ బాండవకోటి కెప్పుడుం
    జేటు దలంచి యే బలువు చేసితి వైరము నాకు నింక నీ
    వీటికి వారివీటికిని వెక్కస మయ్యెడు కయ్య మొప్పగున్. (449)
******************************************************************************************

No comments:

Post a Comment