Translate

03 July, 2016

శ్రీ మదాంధ్రమహాభాగవతము - దశమస్కంధము - ప్రశ్నోక్తి - 1 వ భాగము

ప్రశ్నోక్తి – 1

. రాక్షసరాజుల దురాగతములకు తట్టుకొనలేక భూదేవి ఏరూపమున, ఎవరికి తన గోడు తెలుపుకొనెను?

2. వసుదేవుని తండ్రి పేరేమి?

3. దేవకి తండ్రి పేరేమి?

4. కంసుని తండ్రి పేరేమి?

5. తృణజలూకా న్యాయమననేమి?

6. వసుదేవుడు, దేవకిల మొదటి కుమారుని పేరేమి?

7. కంసునికి తన పూర్వజన్మగురించి, యాదవుల గురించి తెలిపినది ఎవరు?

8. పూర్వజన్మలో కంసుడెవరు?

9. కంసుడు తన తండ్రిని, దేవకి, వసుదేవులను చెఱసాలలో ఎందులకు బంధించెను?

10. లోకమునరాజ్యాధికార వ్యామోహములో పడిన రాజుల ప్రవర్తన ఎట్లుండును?

11. కంసుని సహాయకులెవరు?


జవాబులు (సమాధానములు):

1. భూదేవి గోరూపమున బ్రహ్మదేవుని కడకు చేరి తన గోడు తెలుపుకొనెను. (దశమస్కంధము – పూర్వభాగము – 14 పద్యము.)

సీ. రాజేంద్ర! విను తొల్లి రాజలాంఛనముల,

         వేల సంఖ్యల దైత్యవిభులు తన్ను

      నాక్రమించిన భారమాఁగఁజాలక భూమి

           గోరూప యై బ్రహ్మఁజేరఁ బోయి

      కన్నీరు మున్నీరుగా రోదనము సేయఁ

         గరుణతో భావించి కమలభవుఁడు

      ధరణి నూఱడఁ బల్కిధాత్రియు వేల్పులుఁ

          గదలిరా విష్ణునిఁగాన నేఁగి

తే. పురుషసూక్తంబుఁ జదివి యద్భుతసమాధి

      నుండి యొకమాట విని వారిజోద్భవుండు

      వినుఁడు వేల్పులు ధరయు నే విన్న యట్టి

       పలుకు వివరింతునని ప్రీతిఁ బలికెఁ దెలియ. (14)

2. మథురా నగరమునకు రాజైన శూరసేనుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 20 పద్యము.)

సీ. ఆ శూరసేనున కాత్మజుం డగు వసు

         దేవుఁడా పురి నొక్కదినమునందు

     దేవకిఁ బెండ్లియై దేవకియును దానుఁ

         గడు వేడ్క రథమెక్కి కదలువేళ

     నుగ్రసేనునిపుత్రు డుల్లాసి కంసుఁడు

         చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల

     హరులపగ్గములఁ జేనంది రొప్పఁదొడంగె

        ముందట భేరులు ముఅరజములును

తే. శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ

      గూతుఁతోడి వేడ్క కొనలుసాఁగ

      దేవకుండు సుతకు దేవకీదేవికి

      నరణ మీఁదలంచి యాదరించి. (20)

3. దేవకుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 20 పద్యము.)

4. దేవకుని తమ్ముడైన ఉగ్రసేనుడు. యదు వంశమువాడు. భోజ, అంధక రాజ్యములకు ప్రభువు. (దశమస్కంధము – పూర్వభాగము – 20 & 54 పద్యములు.)

సీ. ఆ శూరసేనున కాత్మజుం డగు వసు

         దేవుఁడా పురి నొక్కదినమునందు

      దేవకిఁ బెండ్లియై దేవకియును దానుఁ

         గడు వేడ్క రథమెక్కి కదలువేళ

      నుగ్రసేనునిపుత్రు డుల్లాసి కంసుఁడు

           చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల

       హరులపగ్గములఁ జేనంది రొప్పఁదొడంగె

           ముందట భేరులు ముఅరజములును

తే. శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ

      గూతుఁతోడి వేడ్క కొనలుసాఁగ

      దేవకుండు సుతకు దేవకీదేవికి

      నరణ మీఁదలంచి యాదరించి. (20)

మ. కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుఁడై పట్టి బ

      ద్దులఁ గావించి హరిం దలంచి వెసఁ దోడ్తో వారు గన్నట్టి పు

      త్రులఁ జంపెన్ గురు నుగ్రసేను యదుఁదద్భోజాఁధకాధీశు ని

       ర్మలుఁబట్టెన్ గడు వాలి యేలెఁ జలమారన్ శూరసేనంబులన్. (54)

5. గడ్డిపురుగు (గడ్డి జలగ) ప్రాకునపుడు వేరొక గడ్డిపోచ కనిపిస్తేకాని (దొరికితేకాని) తనున్న గడ్డిపరకను వదలదు (విడిచి పెట్టదు). దీనినే తృణజలూకా న్యాయము అని అఁటారు.

అలాగే జీవుడు కూడా వేరొక దేహమును (శరీరమును) చూచుకొనకుండ పూర్వదేహమును వీడడు అని సూచింపబడుచున్నది. (దశమస్కంధము – పూర్వభాగము – 29 పద్యము.)

సీ. మేనితోడన పుట్టు మృత్యువు జనులకు

          నెల్లి నేఁడైన నూఱేండ్లకైనఁ

      దెల్లఁబు మృత్యువు దేహంబు పంచత

         నందఁ గర్మానుగుఁడై శరీరి

      మాఱుదేహము నూఁది మఱితొంటి దేహఁబుఁ

         బాయును దనపూర్వభాగమెత్తి

      వేఱొంటిపైఁ బెట్టివెనుకభాగఁబెత్తి

         గమనించు తృణజలూకయును బోలె

ఆ. వెంట వచ్చు కర్మవిసరంబు మును మేలు

      గన్న వేళ నరుఁడు కన్నవిన్న

      తలఁపఁబడిన కార్యతంత్రంబు కలలోన

      బాడితోడఁ గానఁబడినయట్లు.(29)

6. కీర్తిమంతుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 46 పద్యము.)

ఆ. సుదతి మున్ను గన్న సుతుఁగీర్తిమంతునిఁ

      బుట్టు తడవ కంసభూవరునకుఁ

      దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ

      డాసపడక సత్యమందు నిలిచి. (46)

7. నారదుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 52 పద్యము .)

సీ. ఒకనాఁడు నారదుం డొయ్యన కంసుని

        యింటికిఁ జనుదెంచి యేకతమున

      మందలోపల నున్న నందాదులును వారి

           భార్యలుఁ బుత్రులు బాంధవులును

       దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁ

          డాదిగాఁ గల సర్వయాదవులును

      సురలు గాని నిజంబు నరులు గా రని చెప్పి

          కంసుండ! వీవు రక్కసుఁడ వనియు.

ఆ. దేవమయుఁడు చక్రి దేవకీదేవికిఁ

      బుత్రుఁడై జనించి భూతలంబు

      సెఱుపఁబుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ

      జంపుననుచుఁ జెప్పి చనియె దివికి. (52)

8. శ్రీమన్నారాయణునిచే చంపబడ్డ కాలనేమియను రాక్షసుడు. (దశమస్కంధము – పూర్వభాగము – 53 పద్యము.)

క. నారదుమాటలు విని పె

    ల్లారాటముఁ బొంది యదువులనిమిషులనియున్

    నారాయణ కరఖడ్గ వి

    దారితుఁడగు కాలనేమి దాననియు మదిన్. (53)

9. యాదవులెల్లరును దేవతలే అనియు, శ్రీమన్నారాయణుని చేతిలో చావబడ్డ కాలనేమియే తానని నారదుని వలన తెలుసుకున్నతరువాత, తన తఁడ్రి ఉగ్రసేనూడు యదు వంశజుడగుటచే, శ్రీహరిని గుర్తునకు తెచ్చుకొనుచు క్రోధముతో బంధుత్వమును మఱచి తఁడ్రిని, దేవకీవసుదేవులను చెఱసాలలొ బంధించెను. మొదట చంపనన్న దేవకీవసుదేవుల ఆరుగురు పుత్రులను వధించెను. (దశమస్కంధము – పూర్వభాగము – 53&54 పద్యములు .)

క. నారదుమాటలు విని పె

    ల్లారాటముఁ బొంది యదువులనిమిషులనియున్

    నారాయణ కరఖడ్గ వి

    దారితుఁడగు కాలనేమి దాననియు మదిన్. (53)

మ. కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుఁడై పట్టి బ

      ద్దులఁ గావించి హరిం దలంచి వెసఁ దోడ్తో వారు గన్నట్టి పు

      త్రులఁ జంపెన్ గురు నుగ్రసేను యదుఁదద్భోజాంధకాధీశు ని

      ర్మలుఁబట్టెన్ గడు వాలి యేలెఁ జలమారన్ శూరసేనంబులన్. (54)

10. ఈ లోకములో రాజ్యాధికార వ్యామోహములో పడిన రాజులు అజ్ఞానముతో ‘తమ జీవితములు    శాశ్వతములు’ అని తలపోయుచు, మంచిచెడ్డలను మఱచి, తల్లితండ్రులను, అన్నదమ్ములను, మిత్రులను, బంధువులను సైతము తఱచు చఁపివేయుచందురు. (దశమస్కంధము – పూర్వభాగము – 55 పద్యము.)

ఆ. తల్లిఁ దండ్రినైన దమ్ముల నన్నల

      సఖులనైన బంధుజనుల నైన

      రాజ్యకాంక్షఁజేసి రాజులు చంపుదు

      రవనిఁదఱచు జీవితార్థు లగుచు. (55)

11. కంసునకు బాణుడు, నరకుడు, జరాసంధుడు, అఘాసురుడు, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరముష్టికులు, అరిష్టుడు,ద్వివిధుడు, పూతన మొదలగు రాక్షసులు సహాయకులుగ ఉండిరి. (దశమస్కంధము – పూర్వభాగము – 56 వచనము.)

వ. మఱియు, బాణ భౌమ మాగధ మహాశన కేశి ధేనుక బక ప్రలంబ తృణావర్తచాణూర ముష్టికారిష్ట ద్వివిధ పూతనాది సహాయ సమేతుండై, కంసుండు కదనంబున మదంబులణంచిన, వదనంబులు వంచికొని సదనంబులు విడిచి, యదవలై యదువులు పదవులు వదలి, నిషద కురు కోసలవిదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వదేశంబులు సొచ్చిరి. మచ్చరంబులు విడిచి, కొందఱు కంసునిం గొలిచినిలిచి రంత. (56)

హరిఓం‌‌