Translate

07 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 042 (206 – 210)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1. నహుషుని శాపం ఎవరి దర్శనం వల్ల తీరింది?
2.
దేవతలకైనా కష్టాలు ఒక్కొక్కప్పుడు తప్పవు అని పాండవుల నూరడించి పురందర విజయం కథ  
     చెప్పినదెవరు?
3.
రాయబారానికి వచ్చిన కృష్ణుని బందిస్తానని దుర్యోధనుడు ముందే తన అభిప్రాయం తండ్రికి చెప్పాడు.
   విషయం ఇంకా ఎవరికి తెలుసును?
4.
అంబను పరశురామునికి పరిచయం చేసినదెవరు?
5.
తాను పాండవ పక్షంలోకి రానని తన జన్మ రహస్యం కాపాడుమని కృష్ణుడితో కర్ణుడు చెప్పుతాడు, ఎందుచేత?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
ధర్మరాజు దర్శనం వల్ల. - - ఉద్యోగపర్వము ప్రథమాశ్వాసము 201 వచనము
|| .భవదీయ వంశజాతుం డయి యజాతశత్రుం డనుపెంపు గలిగి యుధిష్టిరనామధేయుండైన 
      యొక్కసత్పురుషుని సందర్శనంబున దురితంబులఁబాసి పుణ్యలోకంబు వడయువాఁడ వనినఁ దత్క్షణంబ.  
      (201)

2. శల్యుడు. - ఉద్యోగపర్వము ప్రథమాశ్వాసము 115 పద్యము
|| ఇట్లు వడితి ననుచు నెద నీవు వగవకు
  గారవమున నీమనోరథమ్ము
  ఫలము వొందు నెల్లభంగుల దేవత
  లయినఁ బడుదు రొక్కయవసరమున. (115)

3. భీష్ముడు, విదురలకు కూడా తెలుసును. - ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము 169 వచనము

|| వే ఱొక కార్యంబు సేయం దలంచితి నది వినుము పాండవులకు నేడుగడయు జనార్దనుం డతనిం బట్టి బంధించిన ఱెక్కలువిఱిగినపులుఁగులుంబోలె వారు నాకు విధేయు లగుదురు పాంచాలయాదవాదు లైనతదీయబంధుమిత్రులు నావశంబున వర్తిల్లుదురు సమస్తదేశంబులు నేన యేలుదు దీనికిం దగినయుపాయ సహాయంబు లనువు సేసెద నీ వింక నేమి సెప్పెదవు చెప్పు మనిన విని యతి ఘోరం బగునవ్విచారంబునకు నమాత్యసహితంబుగా సంతప్తచిత్తుం డై వైచిత్రవీర్యుండు గొడుకున కి ట్లనియె. (169)

4. హోత్రవాహనుడు, అంబకు మాతామహుడు. - ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము 293 పద్యము & 294  
     వచనము
|| అనిన విని యెల్ల వారును నధికహర్ష
  మెసఁగ నున్నంత మఱునాఁడ యేఁగుదెంచె
  భార్గవుం డమ్మునీంద్రులు పరమ భక్తి
  నర్చ లిచ్చిరి హోత్రవాహనుఁడుఁ గనియె. (293)
|| కని పరశురామునిసంభావనంబును సంభాషణంబును బడసి కాశి రాజకన్యకంజూపి యిది నాదౌహిత్రి దీనివృత్తాంతం బంతయు విను మని యమ్మానినిం గానిపించిన నదియును. (294)

5. ధర్మరాజుకు తెలిస్తే అతడు అన్నమీది గౌరవంతో రాజ్యం చెయ్యడని, అటువంటి ధర్మాత్ముడు రాజ్యం చేయకపోవడం తప్పు గనుక తన జన్మ రహస్యం కాపాడుమని కృష్ణుడితో కర్ణుడు చెప్పుతాడు. - ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము 42&44 పద్యములు; 43 వచనము
|| హిత ముపదేశించితి వీ
 వతినిర్మలబుద్ధి వగుట నైనను నిది నా
 మతి సొరదు రహస్యము
 క్షితముగఁ బాటింపుమయ్య చిత్తములోనన్. (42)
|| అది యేమిటి కంటేని. (43)
తే|| ధర్మ తనయుండు దానునాతమ్ముఁడగుట
 యెఱిఁగెనేనియు సామ్రాజ్యమేలపూను
 నట్టిధార్మికుఁ డాధిపత్యంబుఁ జేయ
 వలవదే శాశ్వతంబుగ వసుధకెల్ల (వసుధయెల్ల). (44)

******************************************************************************************

No comments:

Post a Comment