Translate

23 May, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 090 (446 – 450)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1. ఎవరి ప్రేరణతో ధర్మరాజు అశ్వమేధయాగానికి పూనుకొన్నాడు?
2. యాదవ వినాశాన్ని గురించి ధర్మరాజుకు తెలిపిన దెవరు?
3. ధర్మరాజు నరకం చూడటానికి కారణం ఏమిటి?
4. మహాప్రస్థానానికి బయలుదేరిన వారెంత మంది? ఎవరు?
5. విరాటుని దేశం పేరేమి?
సమాధానములు (జవాబులు):
1. వ్యాసుని ప్రేరణ అశ్వమేధపర్వము తృతీయాశ్వాసము 209 పద్యము
తురగ మేధ మఖిలదుష్కృతహరము నీ
    వది సమరదక్షిణాన్వితముగఁ
    జేసి నిర్మలత్వభాసమానుండ వై
    వెలయు మమృతకిరణకులవరేణ్య. (209)

2. దారుకుడు కృష్ణుని సారధి మౌసలపర్వముఏకాశ్వాసము – 95 పద్యము
సీఅవనీశ విను మంత నద్దారకుఁడు చని పాండవేయులఁ గని పరమమునులు
    యాదవకులముఁ బేరలుకమైఁ దొల్లి శపించుట మునుఁ దలఁపించి పిదప
    జలధితీరముల నాసవపానమత్తు లై వృష్ణిభోజాంధకవీరు లెల్ల
    మునివరనిర్దిష్టముసలాత్మకము లైనముయ్యంచుతుంగల మోఁదులాడి
తేపేర్చి యొండొరువులఁ బరిమార్చుటయును
    రామకృష్ణులయునికియు నామురారి
    తన్నుఁ బుత్తెంచుటయు సవిస్తారభంగిఁ
    జెప్పె వరలు పెనువగఁ జేడ్పడంగ. (95)

3.రాజయినవాడు నరకం ఒకసారి చూడాలి గనుక స్వర్గారోహణపర్వము ఏకాశ్వాసము  -38 పద్యము
విను మొక్కటి చెప్పెద రా
   జనువానికి నెల్లఁ దప్ప దవనీశ్వర యె
   ట్లను నారకస్థలంబుం
   గనుఁగొనవలయు టిది వేదకథితము సుమ్మీ. (38) 

4. ఏడుగురు-పాండవులు 5గురు, ద్రౌపది, కుక్క. మహాప్రస్థానికపర్వము ఏకాశ్వాసము – 19 వచనము
వల్కలాజినంబులు ధరియించినం దమ్ములు ద్రౌపదియు నట్లు చేసి రందఱుం దత్కాలోచితంబు లగు నిష్టావిధానంబు లాచరించి యగ్నుల నంబుగతంబులు చేసి మొగంబులం దెలి వగ్గలింప గృహంబు వెలువడి రప్పుడు ద్రౌపది షష్ఠత్వనిష్ఠం బోవ సప్తమం బై యొక్క సారమేయంబు వారల వెనుకఁ జనియె నప్పుడు. (19)

5. మత్స్యదేశం- విరాటపర్వము ప్రథమాశ్వాసము – 64 పద్యము
నాకుఁ జూడ మత్స్యనరపతిసద్ధర్మ
    వర్తి సుజనహితుఁ డవార్యబాహు
    బలుఁడు గాన నతనిపాల నందఱుఁ దగ
    వైనపనుల నిలుచు టభిమతంబు. (64)
*******************************

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 089 (441 – 445)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1.              అజ్ఞాత వాసంలో అర్జునుని పేరేమి?
2.             భీముని శంఖం పేరు ఏమిటి?
3.             వ్యాసుని కుమారుడెవరు?
4.             17వ రోజు సాయంకాలం దుర్యోధనుని సంధిచేసుకొమ్మనిఎంతగానో బోధించాడొక వీరుడు. ఎవరాతడు?
5.             వ్యాసుడు ఒకసారి ధృతరాష్ట్రునికి చూపు ఇస్తాడు ఎపుడు?

సమాధానములు (జవాబులు):
1. బృహన్నల విరాటపర్వము ప్రథమాశ్వాసము 89 పద్యము
అని కొలిచి యే బృహన్నల
   యనునామముతోడఁ గన్యకాంతఃపురవ
   ర్తన మొనరించుచు లాసిక
   తనమున నిపుణుండ నై యతని మెచ్చింతున్. (89)

2. పౌండ్రము భీష్మపర్వము ప్రథమాశ్వాసము 176 వచనము
అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పౌండ్రంబును యుధిష్థిరుం  
    డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి 
    ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖదండనాయకులు తమతమశంఖంబులుఁ బూరించిన. (176)

3. శుకుడు శాంతిపర్వము షష్ఠాశ్వాసము -246 వచనము
కృష్ణద్వైపాయనపుత్రుం డనుమాత్రమకాని శుకుని జన్మంబు తెఱంగునునతని తల్లిని నతండు బాల్యంబున  
    మహనుభావుం డగుటకుం గతంబును నతండు సిద్ధి పొందినభంగియు నెఱుంగ నవి యెల్ల నెఱింగింపుము
    (246)

4. కృపాచార్యుడు శల్యపర్వము ప్రథమాశ్వాసము 41& 63 వచనములు; 42-62 పద్యములు
మందిరంబుఁ బ్రవేశింపక యొక్కబయల నఖిలబంధుమిత్రపరిజనవృతుం డై నిలిచె నయ్యవసరంబునఁ  
    గృపార్దచిత్తుం డై కృపాచార్యుం డన్నరేంద్రునకి ట్లనియె. (41)
సమరము మిముబోంట్లకు ను
   త్తమధర్మం బిదియ తొంటిధాత్రీశులు కృ
   త్యముగఁ గొని యాచరించిరి
   తమకు సుగతి గోరి కీర్తితస్ఫురణమెయిన్. (42)
ఐననునొకపలు కడ్డము
   గా నొడివెద దని లెస్సగా విని  యది మే
   లైనని జేసెదు కాదే
   న్మానెద నెర్పడఁగ వినుము మనుజాధీశా. (43)
ఇంతకమున్ను చెల్లెఁ బదియేడుదినంబులసంగరం బతి
    శ్రాంతతఁ గుంది రిందుఁ గలసైనికు లద్దెసఁ గల్గుయోధు లా
    క్రాంతవిరోధిదర్పుఁడు పురందరనందనుబల్మికల్మి ని
    శ్చింతత నుల్లసిల్లెదరు చెక్కు చెమర్పక కౌరవేశ్వరా. (50)
సమరము నిష్కారణవై
    రమునం బాటిల్లె నెల్ల రాజులు భరతో
    త్తములును మడిసిరి విడు కో
    పము దీర్ఘక్రోధుఁ డైనపతి కీడొందున్. (55)
తమకు బలం బెక్కినతఱి
    సముచిత మగు విగ్రహంబు శత్రుల కుత్సా
    హము మీఱినపుడు కర్త
    వ్యము సంధి యనంగ విందు మార్యులచేతన్. (56)
హరియును గా దనండు కరుణాన్వితు లై తగ న్నమ్మహాత్ము లె
    ప్పరుసునఁ గార్యనిశ్చయము పల్కినఁ గీచకవైరియుం బురం
    దరతనయుండునుం గవలు దానికి మా ర్పలుకంగ నెమ్మెయిం
    జొర రగు సంధి యెట్లు ననసూయత నూల్కొని చేయు మిత్తఱిన్ . (61)
ఇంత చెప్పు టనికి నే నోడి ప్రాణర
     క్షణము చేసికొనుట కాదు నీకుఁ
     బథ్య మనియుఁ దఱిమి పల్కితి విను విన
     వేని నొచ్చి తలఁచె దిట్టులగుట. (62)
అని యగ్గౌతముండు శోకాయత్తచిత్తుం డగుచుం దనకు హితోపదేశంబు చేసిన విని దుర్యోధనుండు వేఁడినిట్టూర్పు నిగిడించి యొక్కింతసేపు చింతాక్రాంతు డై యూర కుండి వ్రాల్చిన కనుదోయి విచ్చి యవ్విప్రవరుమొగంబు చూచి యి ట్లనియె. (63)

5. యుద్ధంలో చనిపోయిన వీరుల విశేషాలు చూపించడానికి ఆశ్రమవాసపర్వము ద్వితీయాశ్వాసము 121
     పద్యము
తగ నాకురువృద్ధునకు నొ
    సఁగె నాఁటికి దివ్యదృష్టి సాత్యవతేయుం
    డగణితతపఃప్రభావం
    బు గని యధికవిస్మయంబుఁ బొందఁగ జనముల్. (121)
*************