Translate

02 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 038 (186 – 190)

ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1. దుర్యోధనుడు ఒక రాజును వంచించి తన వైపు యుద్ధం చేసేటట్లు చేసుకొన్నాడు, ఎవరా రాజు?
2.
నహుషుని పదవీభ్రష్టుని చేసిన మహర్షి ఎవరు?
3.
ధృష్టకేతుడు ఎవరు?
4.
ధృతరాష్ట్రుడూ, కొడుకులూ అడవిలాంటి వారయితే పాండవు లెటువంటివారని కృష్ణుడు చెప్పాడు?
5.
భారత యుద్ధానికి దూరమయినవారు ఇద్దరు ప్రసిద్ధులున్నారు, ఎవరువారు?
---------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
శల్యుడు మద్రదేశాధిపతి శల్యుడు, పాండవుల మేనమామ, పాండవులకు సాయపడాలని అక్షౌహిణి సేనతో  
    వస్తున్నపుడు, త్రోవలో ఎన్నో చక్కని సౌకర్యాలు కలుగజేసి దుర్యోధనుడు అతనిని సంతృప్తిపరచి తన పక్షాన  
    యుద్ధం చేసేటట్లు వరం పొందుతాడు. - ఉద్యోగపర్వము ప్రమాశ్వాసము 95-97 పద్యములు
|| సత్త్యసరస్వతి వగుమౌ
    చిత్త్యవిశారదము నీదుచిత్తము నియమౌ
    దాత్త్యంబు మెఱయ నాకు
    మాత్త్యుఁడ వై పూని నడపు మత్త్సైన్యంబున్. (95)
|| తలపఁ బాండవులును ధార్తరాష్ట్రులు నీకు
     నొక్కరూప భక్తి యుక్తిఁ జాల
     నీవు నన్ను మాననీయుండు గాఁగ
     నుగ్రహించి తగఁ బరిగ్రహింపు. (96)
|| అనవుడు శల్యుఁ డియ్యకొని యట్టిద కాదె విభేద వృత్తి నా
     మనముల లేదు పాండవసమాజము మీరును నొక్కరూప కా
     వున నిది లెస్సమాట దగవుం దలపోయఁగ మున్ను ప్రీతిఁ గాం
    చిన నిను నెమ్మిఁ గూడుటయ చేయుదు నిట్టుల యెల్లభంగులన్. (97)

2. అగస్త్యుడు పల్లకి మోస్తున్నపుడు నహుషుడు అగస్త్యుని తన్నాడు. ఉద్యోగపర్వము ప్రమాశ్వాసము  199&200 పద్యములు; 201 వచనము
మునివరుఁ డైనయగస్త్యుఁడు
    సనుదెంచిన శతమఖుండు సమ్మతి నుచితా
    సనమిడి యర్ఘ్యముఁబాద్యము
    నొనరిచి యిట్లనియె సవినయోక్తి నతనితోన్. (199)
అధికవిభవ మెసంగఁ నసమానశక్తిస
    నాథుఁడగుచు నున్ననహుషుఁ డిప్పు
    డేమికతన భాగ్యహీనుఁ డై యుజ్జ్వల     
    శ్రీదొఱంగె మునివరేణ్య చెపుమ. (200)
అనినవిని యమ్మునీంద్రుం డి ట్లనియె నన్నహుషుని మోచి వేసరు చున్నమునులతనికడ గోష్ఠివినోదంబుల
    నుండి బ్రాహ్మణంబు లయినమంత్రంబులు గోసంప్రోక్షణంబునందుఁ జెప్పఁబడి యుండు నవి నీకుఁ
    బ్రాహ్మణభూతంబు లగునేయని యడిగినం బాపనిశ్చయుండై యతం డమ్మంత్రంబులు ప్రమాణంబులుగావనిన
    నే నమ్మాట నిషేధించి పూర్వాచార్యులచేత నభినందితంబు లగుమంత్రంబులు నిందించుట యజ్ఞానం బని
    వివాదంబు సేసిన నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నిన నతనిం గనుంగొని పుణ్యహీనుండును
    దేజోహానిదీనుండును నగుట యుపలక్షించి నీవు పూజనీయు లయినమహామునుల నిన్ను వహింపం
    బనిచితి వారలు గొనియాడుమంత్రంబులు గర్హించి తదియునుంగాక నన్నునవమానించితివి గావున
    నింద్రపదభ్రష్టుండ వై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగరూపంబున నుండు మని శాపం బిచ్చి
    పదంపడి యనుగ్రహించి భవదీయ వంశజాతుం డయి యజాతశత్రుం డనుపెంపు గలిగి
    యుధిష్ఠిరనామధేయుండైనయొక్కసత్పురుషునిసందర్శనంబున దురితంబులఁబాసి పుణ్యలోకంబు
    వడయువాఁడ వనినఁ దత్క్షణంబ. (201)

3. శిశుపాలుని కుమారుడు ధృష్టకేతుడు అక్షౌహిణి సైన్యంతో పాండవ పక్షంలో పోరాడాడు. - ఉద్యోగపర్వము
     చతుర్థాశ్వాసము 109 పద్యము
సీ|| పటుపరాక్రమనిధి పాంచాలపతియు నమానుషతేజుండు మత్స్యవిభుఁడు
     శత్రుభీకరమూర్తి సాత్యకియును జరాసంధాగ్రతనయుండు శౌర్యఘనుఁడు
     సహదేవుఁడును ధైర్యశాలి యాదవశిరోమణి చేకితానుండు మహితవిభవ
     ఖని యగుశిశుపాలతనయుండు దోర్దర్పధుర్యుండు ధృష్ట్కేతుండు సమర
 తే|| లంపటుండు శిఖండియు లావు వెరవుఁ
      గలరు నీయెడ ననురక్తి గలరు సాలఁ
      బెంపు గలరుక్కు ముట్టిన తెంపు గలరు
      కోరి పతులుగఁజేయు మక్షోహిణులకు. (109)

4.
సింహములవంటివారు. అరణ్యంలో ఉంటే సింహాలకు రక్షణ. సింహాలు ఉంటే అరణ్యానికీ రక్షణ. ఎవరూ నరికి  
    వేయరు. అందుచేత కలసి ఉంటే మేలు. అలాగే కౌరవులూ పాండవులూ కలసి ఉంటే ఉభయతారకం అని  
    సంజయ రాయభారం తరువాత కృష్ణుడు చెపుతాడు. - ఉద్యోగపర్వము ప్రమాశ్వాసము 358 పద్యము
|| ధృతరాష్ట్రుండును బుత్రులున్ వనము గుంతీనందనుల్ సింహముల్
      మతి నూహింప నసింహ మైనవనమున్ మర్దింతు రెందున్ వనా
      వృతవృత్తంబులు గానిసింహములకున్ వేగంబ చే టొందుఁ గా
      తగం బొందుట కార్య మీయుభయము న్సంతుష్టిమై నున్కికిన్. (358)
5.
బలరాముడు, రుక్మిణి సోదరుడు రుక్మి భారత యుద్ధానికి దూరంగా ఉన్నారు. - ఉద్యోగపర్వము
     చతుర్థాశ్వాసము 181 పద్యము
తే|| ఇట్లు బలదేవరుక్ముల కిద్దఱకును
     గయ్యమునకు సన్నాహంబు గలుగదయ్యెఁ
     గాని తక్కులోకమ్మునఁ గలుగునృపతి
     కోటి యిరువాఁగునందును గూడె ననికి. (181)
******************************************************************************************


01 January, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) - 129



తెలుగు సుద్దులు…..(129)
||ఇచ్చే వారల సంపద
     హెచ్చేదే`కాని లేమి యేలా కలుగున్
       అచ్చెలమ నీళ్లు చల్లిన
       విచ్చలవిడి నూ`రుచుండు వినరా వేమా!.                  
భావముః
ఇతరులకు తమ సంపదను పంచేవారి (దాత) సంపద పెరుగుతుందేకాని, తరిగిపోదు వారిదగ్గరకు దారిద్ర్యం దరిచేరదు. వేమన దీనిని చక్కటి ఉపమానంతో మనకు అవగాహనకల్గిస్తున్నారు.  నీటిచెలమలో నీరు తోడి బయటకు పోసేకొద్ది, స్వచ్ఛమైన మంచినీరు ఊరుతుంటుంది. లోభత్వం వల్ల ప్రయోజనం లేదు, దాతృత్వము వల్ల సంపద పెరుగుతూనే ఉంటుందని గ్రహించి దానశీలత కలిగియుండవలని హితవుపలుకుతున్నారు. ||01-01-2015||

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 037 (181 – 185)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       

నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్| 
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

 [డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1. కౌరవ పాండవుల మధ్య మొదటి రాయబారం ఎవరిది?
2.
ధర్మరాజు ధర్మవృక్షము అయితే దానికి మూలం ఎవరు?
3.
పాండవులలో ఒకడు సంజయుని బాలసఖుడు, ఎవరు?
4.
పుణ్య పురుడని ఎవరినంటారు?
5.
నువ్వెంత లంచమిచ్చినా కృష్ణుడు కౌరవపక్షానికి రాడు - మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
---------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
ద్రుపదుని పురోహితుడు. ఉద్యోగపర్వము ప్రమాశ్వాసము 52 వచనము; 53,54 పద్యములు
|| అట్టిసమయంబున నజాతశత్రుననుమతి వడసి పాంచాలపతి వయోజ్ఞానవృద్ధుండైన తనపురోహితుం  
      గురుపతిపాలికిఁ బుచ్చువాఁడై యతని రావించి. (52)
|| హితుఁడవు మతిమంతుండవు
    చతురవచనకోవిదుఁడవు సమయజ్ఞుఁడ వు
    న్న తవంశవర్ధనుఁడ విం
    గిత వేదివి నెచ్చెలివి సుకృతి ట్లగుటన్. (53)
తే|| నాకుఁ గర్తవ్య మగుపని నీకుఁ జేయఁ
    దగవు గావున నెల్లవిధములఁ బూని
    పాండవార్ధంబు ధృతరాష్ట్రుపాలి కరిగి
    నేర్పు వాటించి కార్యంబు దీర్పవలయు. (54)

2.
కృష్ణుడు - భూసురులు వేదములు - ఉద్యోగపర్వము ప్రమాశ్వాసము 356 పద్యము
|| ధర్మజుండు ధర్మ తరు వర్జునుఁడు ఘన
    స్కంధ మనిలసుతుఁడు శాఖ కవలు
    పుష్పఫలము లేను భూసురులును వేద
    ములుఁ దదీయ మైనమూలచయము. (356)

3.
అర్జునుడు. - ఉద్యోగపర్వము ప్రమాశ్వాసము 378 పద్యము
|| బాలసఖుండవు నాకును
    నీలెస్సఁదనంబు నేము నీతి విడిచి దు
    శ్శీలుర మగుటయు శైశవ
    లీల మొదలు గాఁగ మును దెలియదే నీకున్. (378)

4.
సమర్ధుడైనా సహనం వహించేవాడు, పేదవాడయినా ఉన్నంతలో ప్రీతిగా దానంచేసేవాడు పుణ్యపురుషుడు. - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 42 పద్యము
తే|| చెల్లి యుండియు సై రణ సేయునతఁడుఁ
    బేదవడియును నర్ధికిఁ బ్రియముతోడఁ
    దనకుఁ గలభంగినిచ్చునతండుఁ బుణ్య
    పురుషులనిచెప్పి రార్యులు గురువరేణ్య. (42)

5.
రాయబారానికి కృష్ణుడు స్తున్నాడని తెలిసికొని ధృతరాష్ట్రుడతనికి తగిన కానుకలిచ్చి లోబరుచుకోవాలని సంకల్పించినపుడు విదురుడు ధృతరాష్ట్రునితో నువ్వెంత లంచమిచ్చినా కృష్ణుడు కౌరవపక్షానికి రాడు అని అంటాడు. - ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము 159 పద్యము
|| నీతలఁ పేను గంటి నొకనేర్పున శౌరికి లంచ మిచ్చి సం
    ప్రీతునిఁ జేసి కార్యగతి భేదము సేయగఁ జూచె దింత బే
    లైతిగదే సుమేరుసదృశార్ధముఁ జూచియుఁ బార్ధుఁ బాయునే
    యాతఁడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీ వెఱుంగవే. (159)
@@@@@@@@